
ఢిల్లీ,14, జనవరి (హి.స.) రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు. సెర్గియో గోర్ నుంచి అక్రిడిటేషన్ పత్రాలను ద్రౌపది ముర్ము స్వీకరించారు
సెర్గియా గోర్ ట్రంప్ సన్నిహితుడు. గతేడాది భారత్లో రాయబారిగా నియమితులయ్యారు. ఇటీవలే రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోడీని కలిసిన ఫొటోను ఎక్స్లో పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత్-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా జరుగుతుందని తెలిపారు.
అన్నట్టుగానే తాజాగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో-భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. వాణిజ్యం, కీలక ఖనిజాలు, అణు సహకారం, రక్షణ, ఇంధనం గురించి చర్చించినట్లు జైశంకర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర విషయాలపై కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని అంగీకరించినట్లుగా స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ