
అనకాపల్లి, 14 జనవరి (హి.స.)అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని తమ నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పాల్గొన్నారు. భోగి మంటలను వేసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కళాకారులతో కలిసి ఆనందంగా గడిపారు. గంగిరెద్దులకు పూజలు చేశారు. హరిదాసు కీర్తనలను ఆస్వాదించారు. అయితే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కేరళ సంప్రదాయ వాయిద్యాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెండా అని పిలుచుకునే ఆ డోలు చప్పుళ్లకు ఆకర్షితులైన హోం మంత్రి.. వాటిని ఎంతో ఉత్సాహంగా వాయిస్తూ సందడి చేశారు. తాళానికి తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ పండుగ వేడుకలకు శోభను తెచ్చారు. మంత్రి స్వయంగా డోలు వాయించడం చూసి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఏపీ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి కుటుంబంలో ఆనందం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి పండుగ అంటేనే వ్యవసాయాధారిత పండుగ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV