
అమరావతి, 15 జనవరి (హి.స.)
: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే భయం ఉండేదని, కానీ ఈ ఏడాది భోగి–సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో ఆనందంగా తమ ఊళ్లలో జరుపుకున్నారని సీఎం చెప్పారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, గ్రామాలతో ఉన్న అనుబంధమే మన సంస్కృతి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారు చాలామంది ఉన్నారని, అయితే అదే సమయంలో జీవన ప్రమాణాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైనా, బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అసమానతలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ