
ఢిల్లీ,15, జనవరి (హి.స.) అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో పైలట్ మేనల్లుడికి ‘విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో’ (AAIB) సమన్లు జారీ చేయడాన్ని భారత పైలట్ల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఇది వేధింపుల కిందికే వస్తుందని విమర్శించింది. ఈ క్రమంలోనే ఏఏఐబీకి లీగల్ నోటీసులు పంపించింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్లు కూడా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమిత్ మేనల్లుడు కెప్టెన్ వరుణ్ ఆనంద్కు ఏఏఐబీ ఇటీవల సమన్లు జారీ చేసింది. జనవరి 15న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎయిరిండియాలో పైలట్గా పనిచేస్తున్న వరుణ్ ఆనంద్.. ‘భారత పైలట్ల సమాఖ్య’ (FIP)లో సభ్యుడిగా ఉన్నారు.
ఏఏఐబీ నోటీసులను పూర్తి అనవసరమైన చర్యగా ఎఫ్ఐపీ పేర్కొంది. ‘‘ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని కెప్టెన్ వరుణ్ ఆనంద్ను పిలిపించడం అనవసరం. ఇది వేధింపులకు పాల్పడటం, మానసిక క్షోభకు గురిచేయడమే అవుతుంది. ఆయన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది’’ అని పైలట్ల సమాఖ్య ఏఏఐబీకి పంపిన నోటీసులో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ