
నారావారిపల్లె, 15 జనవరి (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు మకర సంక్రాంతి పండుగను తన స్వగ్రామమైన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో జరిగిన ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, మనవడు దేవాంశ్, నటుడు నారా రోహిత్ దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి తన తల్లిదండ్రులైన అమ్మణమ్మ, నారా ఖర్జూర నాయుడు సమాధుల వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులు, స్థానిక పెద్దలతో కాసేపు ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగాలమ్మ ప్రసాదాలను స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV