
ఢిల్లీ, 15 జనవరి (హి.స.)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తెలుగు రాష్ట్రాల ప్రజలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..మన హృదయాల్లో ఆనందం, కృతజ్ఞతా భావాలను నింపే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని కొనియాడారు. ఈ పండుగకు ప్రకృతితో ఉన్న అన్యోన్య అనుబంధాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే ఈ శుభసమయం, ప్రకృతిని గౌరవించే మన సంప్రదాయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి కలలు సాకారం కావాలని, ప్రతి ఇంటా సంక్రాంతి కాంతి వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని తెలుగులో కూడా శుభాకాంక్షలు తెలపడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సంక్రాంతి వైభవం కనిపిస్తుంది. పట్టణాలను వీడి పల్లెలకు చేరిన ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV