
ఢిల్లీ,19,, జనవరి (హి.స.)అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో వాణిజ్యం కుంటుపడుతున్నా.. మనదేశ ఔషధ ఎగుమతులు మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయ ఎగుమతుల కంటే ఇవి 6.5% ఎక్కువ. మన ఔషధాల ఎగుమతులు బ్రెజిల్, నైజీరియా దేశాలకు వేగంగా పెరుగుతున్నాయని తేలింది.
2024-25 ఇదే సమయంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాకు 17.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,600 కోట్ల) అధికంగా ఔషధాలు మనదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. మన దేశం నుంచి పెరిగిన ఔషధ ఎగుమతుల్లో ఈ వాటా 14%. మన ఔషధాల ఎగుమతులు వేగంగా పెరిగింది ఈ దేశానికే.
దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్కు కూడా ఔషధ ఎగుమతులు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.900 కోట్ల) మేర అధికమయ్యాయి.
నెదర్లాండ్స్కు ఎగుమతులు 58 మిలియన్ డాలర్లు (సుమారు రూ.522 కోట్లు) పెరిగాయి. ఐరోపా ఫార్మా పంపిణీ రంగంతో భారత ఔషధ కంపెనీలు మరింతగా అనుసంధానం అయ్యాయనడానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ