
చెన్నై, 19,జనవరి (హి.స.) అవినీతికి చట్టబద్ధత కల్పించే చర్యగా మారుతుందన్న కారణంగానే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసినట్లు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఓ ఆంగ్ల దినపత్రిక చెన్నైలో నిర్వహించిన సాహిత్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చా వేదికలో ఎన్నికల బాండ్లపై లేవనెత్తిన ఓ ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. 1966 నుంచి రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇస్తున్నాయని, ఇది మన దేశంలో చట్టవిరుద్ధం కాదని తెలిపారు. అదే సమయంలో పేరు వెల్లడించకుండా విరాళం ఇచ్చే ఎన్నికల బాండ్లను అనుమతించడమనేది రాజకీయ అవినీతికి చట్టబద్ధత కల్పించే చర్యగా మారుతుందని పేర్కొన్నారు. అందుకే ఆ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిందని తెలిపారు. పథకాన్ని రద్దు చేసినా కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చే విధానం కొనసాగుతూనే ఉందని చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ