
అమరావతి, 03 జనవరి (హి.స.), :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు. ఏఐ మన ఆలోచనా శక్తిని ప్రభావితం చేసేస్థాయికి చేరుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో స్వీయవిశ్లేషణ శక్తిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని న్యాయవాదులకు సూచించారు. విజయవాడకు వచ్చిన జస్టిస్ పీఎస్ నరసింహ శుక్రవారం ఏపీ హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి శ్రీవారి ప్రతిమను అందజేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ పీఎస్ నరసింహ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు కూడా తమ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంపై న్యాయవాదులు, న్యాయమూర్తులకు శిక్షణ అవసరమని సూచించారు. న్యాయమూర్తుల కోసం జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే.. న్యాయవాదులకు కూడా శాశ్వత లీగల్ అకాడమీ ఏర్పాటుచేసే విషయంపై దృష్టి సారించాలని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వొకేట్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్కు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ