
రాజమండ్రి, 23 ఫిబ్రవరి (హి.స.)
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి (Rajahmundry) నగరంలో కల్తీ పాలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. కల్తీ పాలు తాగిన కారణంగా రెండు ప్రధాన కాలనీల వాసులు తీవ్ర అనారోగ్యం బారిన పడటం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది. నగర పరిధిలోని చౌడేశ్వరి నగర్ (Chowdeshwari Nagar), వెంకటేశ్వర నగర్ (Venkateshwara Nagar) ప్రాంతాల్లో ఇవాళ ఉదయం పాలు తాగిన కొద్దిసేపటికే చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధితులు విలవిలలాడారు.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పడటంతో పరిస్థితి విషమంగా మారింది. ఈ మేరకు అస్వస్థతకు గురైన బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. పాలలో ఏదైనా రసాయనం కలిసిందా లేక పాడైపోయిన పాలను విక్రయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV