
డిల్లీ, 24 ఫిబ్రవరి (హి.స.)
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని తన ప్రసంగాల్లో 'సిగ్గుపడాల్సిన విషయం'గురించి (Shame) మాట్లాడుతున్నారని, కానీ అసలు సిగ్గుపడాల్సిన అంశాలు తన వద్ద ఉన్నాయంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. అంతర్జాతీయ నేరస్థుడు ఎక్స్టన్ ఫైల్స్ (Epstein Files)లో ప్రధాని మోదీ, ఆయన మంత్రి, ఆయన సన్నిహితుల పేర్లు ఉండటంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. అంతటి దారుణమైన నేరస్థుడితో మోడీ పేరు ముడిపడి ఉండటం దేశానికే సిగ్గుచేటని మండిపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ ద్వారా దేశ డేటాను తాకట్టు పెట్టారని, రైతులను, టెక్స్టైల్ పరిశ్రమను సర్వనాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. అమెరికాతో చేసిన డీల్లో దేశ ప్రయోజనాలను అమ్మేశారని.. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు.
అదానీ కేసుతో నిద్రలేని రాత్రులు..
గౌతమ్ అదానీ (Gautam Adani)పై అమెరికాలో నడుస్తున్న కేసు ప్రధాని మోదీ నిద్రను దూరం చేసిందని రాహుల్ కామెంట్ చేశారు. అదానీపై కేసు అంటే అది బీజేపీ (BJP)ఆర్థిక వ్యవస్థపై పడిన కేసు అని, అందుకే 14 నెలలుగా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. 'మోదీ గారూ.. మీరు మీ మిత్రులైన అనిల్ అంబానీ, అదానీ కోసం మీకు నచ్చింది చేసుకోండి. కానీ నేను, కాంగ్రెస్ పార్టీకి చెందిన బబ్బర్ షేర్లు దేశ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటాం. మేము ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గం' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..