
ఆసిఫాబాద్, 10 మార్చి (హి.స.)
డ్యూటీ అంటే మీకు అంతా
తమాషాగా ఉందా..? మీకు ఇష్టం వచ్చినట్టు విధులు నిర్వహిస్తే కుదరదని కలెక్టర్ హరిత వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌటాల మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో పలువురు వైద్యసిబ్బంది గైర్హాజరు ఉండటంతో పాటు హాజరు పట్టిక ఖాళీ ఉండగా.. హాజరు వేశారు. అలాగే మూసి ఉన్న డేటా ఎంట్రీ రూం తెరిచి చూడగా సిస్టమ్ ప్రింటర్ పై దుమ్ము ధూళి పేరుకుపోయి ఉండటాన్ని కలెక్టర్ గమనించి సిబ్బంది పని తీరు పై అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది తమ పని తీరు మార్చుకోవాలని.. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు పూర్తయిన సిలబస్ వివరాలు, వార్షిక పరీక్షల కోసం కొనసాగుతున్న బోధన తీరును ఆరా తీశారు. ఆ తర్వాత తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..