
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)
దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంపై కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) మండిపడ్డారు. స్పీకర్ తీర్పుపై కేటీఆర్ తెగ ఎగిరెగిరి పడుతున్నారని చీకటిరోజు అని, ప్రజల తీర్పును అవమానించడం, ప్రజాస్వామ్య విలువలు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువింద కేటీఆర్.. పదళ్ల పాలనలో నీ కింద ఉన్న నలుపును ఒక సారి చూసుకో అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన చేతులు మీవి అని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు మీ పదేళ్ల పాలనలో ప్రతిరోజు చీకటి రోజేనన్నారు.
మీ కాకిగోల వినేవారెవరూ లేరు:
ప్రజాస్వామ్య విలువలు అనే పదం ఉచ్చరించడానికి కూడా మీ కుటుంబానికి అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని లోక్ భవన్ సాక్షిగా ఖూనీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు ఇచ్చింది. మీరు కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో మీ ఫిరాయింపులకు నిలువెత్తు సాక్షాలు 39 మంది ఎమ్మెల్యేలు. మీ ఫిరాయింపుల దాహాకి ఆనాడు అంతే లేకుండా పోయిందని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, చివరకు వార్డు మెంబర్లను కూడా వదిలిపెట్టలేదు కదా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులనని కల్వకుంట్ల కుటుంబం ఎంత కాకిగోల పెట్టినా వినేవారెవరూలేరన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు