
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ(Vasirreddy Padma) తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పేందుకు జగన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ‘జగన్ రెడ్డి పాలన స్వర్ణయుగం కాదు.. రాక్షస యుగం’ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో కాగ్ ఇచ్చిన నివేదికను కూడా జగన్ రెడ్డి చదివి వినిపించాలని డిమాండ్ చేశారు.
అప్పులపై లేఖలు రాయడం కాదని.. రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖలు రాయాలని పద్మ సూచించారు. మహిళలపై వైసీపీ నేతలు వేధింపులు చేసినప్పుడు చర్యలు తీసుకోని జగన్కు.. నేడు మహిళల రక్షణ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ కేసులో కూడా జగన్ ప్రమేయం ఉందని వాసిరెడ్డి పద్మ అనుమానం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్