
హైదరాబాద్, 11 మార్చి (హి.స.)మధ్యప్రాచ్యం దేశాల్లో ఉద్రిక్తతలు, గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన పరిస్థితులపై ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (APSADA) సభ్యులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రొయ్యల రైతులు పానిక్ హార్వెస్టింగ్ చేయవద్దని మంత్రి సూచించారు. మధ్యప్రాచ్యం దేశాలకు భారత సముద్ర ఆహార ఎగుమతులు కేవలం 3 – 4 శాతం మాత్రమే అని మంత్రి వెల్లడించారు.
ఇతర దేశాలకు సముద్ర ఆహార ఎగుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని వివరించారు. అమెరికా మార్కెట్లో త్వరలో రొయ్యల డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా 50, 60 కౌంట్ రొయ్యలకు అక్కడ మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కంటైనర్ల కొరత ఉందన్న వార్తలు అసత్యమని చెప్పారు మంత్రి. అలాంటి వదంతులు రాకుండా ఎగుమతుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతులు వదంతులను నమ్మకుండా ఆక్వాకల్చర్ కార్యకలాపాలను కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్