
రాజమహేంద్రవరం, 12 మార్చి (హి.స.)
రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు ప్రాంతంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందడంతో, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 13కు చేరింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని స్వరూప్నగర్కు చెందిన బండారు వీర లక్ష్మి (60) అనే వృద్ధురాలు ఈ కల్తీ పాల ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూశారు. దీంతో బాధితుల కుటుంబాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మరో ఏడుగురు బాధితులు వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
అడ్డాల గణేశ్వరరావు అనే వ్యక్తి నిర్వహించే 'వరలక్ష్మి మిల్క్ సెంటర్' నుండి పాలు కొనుగోలు చేసిన సుమారు 20 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బాధితుల నమూనాలను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. పాలలో అత్యంత విషపూరితమైన 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) కలవడం వల్లే బాధితుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని నివేదికలు ధృవీకరించాయి. కాగా, ఫిబ్రవరి 16వ తేదీనే బాధితులు అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరడం ప్రారంభించినప్పటికీ, ఈ వ్యవహారం మొదట సాధారణ అనారోగ్యంగానే భావించారు. అయితే, ఫిబ్రవరి 22న కాకినాడ జీజీహెచ్లో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV