
అమరావతి, 12 ,మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై కీలక సమీక్ష నిర్వహించారు. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై మంత్రులకు ఆయన రేటింగ్స్ ప్రకటించారు. ఏ మంత్రి ఫైళ్లను పరిష్కరించడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో సీఎం గణాంకాలతో సహా వివరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచి అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తున్నట్లు తేలింది. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.
.మరోవైపు, హోం మంత్రి వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరలో ఉండటం గమనార్హం. మంత్రులు ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా, నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని, దీనిపై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV