
విశాఖపట్నం, 12 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం క్యాప్జెమినీ (Capgemini) గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్తో లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో క్యాప్జెమినీ సంస్థ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. విశాఖలో సంస్థ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మధురవాడ ఐటీ పార్కులోని హిల్-1పై 20 ఎకరాల భూమిని అధికారులు, సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. దీంతో పాటు అడివివరం, ఆనందపురం పరిధిలోని మరికొన్ని ప్రాంతాలను కూడా కంపెనీ ప్రతినిధుల బృందం సందర్శించింది.
త్వరలోనే తాత్కాలిక కార్యాలయం..
శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం జరిగే వరకు, తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంస్థ ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని సెంట్రల్ పార్కు సమీపంలో ఒక ప్రైవేటు భవనాన్ని తాత్కాలిక కార్యాలయం కోసం ఎంపిక చేశారు. అతి త్వరలోనే ఇక్కడి నుండి క్యాప్జెమినీ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, క్యాప్జెమినీ వంటి అంతర్జాతీయ సంస్థ రాకతో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV