గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్
తెలంగాణ వ్యాప్తంగా అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే బాధ్యత మాది.. అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొంత కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందన్న ఉత్తమ్.. కేంద్రం, రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ఇచ్చిందని వెల్లడించారు.
Uttam Kumar reddy


హైదరాబాద్, 13 మార్చి (హి.స.)దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన, గ్యాస్ సరఫరా పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని గుర్తు చేస్తూ.. ప్రస్తుత పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ పలు కీలక వివరాలను వెల్లడించారు.

మార్కెట్లో కొంత మేర గ్యాస్ కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, దానికి అనుగుణంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఉత్పత్తి పెంపు: LPG ప్రొడక్షన్ను పెంచామని కేంద్రం తెలిపిందని, ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కిరోసిన్ సప్లై: తెలంగాణ రాష్ట్రానికి 1740 కిలో లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

స్టేట్ లెవల్ కమిటీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నేతృత్వంలో సివిల్ సప్లై కమిషనర్, పోలీస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

జిల్లా స్థాయి కమిటీలు: ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, వైద్య అధికారులు LPG కంపెనీ ప్రతినిధులతో కూడిన కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాయి.

కమాండ్ కంట్రోల్ రూమ్: హైదరాబాద్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి, సరఫరాలో అంతరాయాలను నివారిస్తున్నారు.

తమను కూడా అత్యవసర సేవల కింద గుర్తించి సిలిండర్లు సరఫరా చేయాలని హోటల్, రెస్టారెంట్ యజమానులు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా చూసే పూర్తి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఉత్తమ్ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande