
హైదరాబాద్, 14 మార్చి (హి.స.)బీసీ రక్షణ చట్టం విధివిధానాల రూపకల్పనపై విజయవాడ తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర చర్చించారు. చట్టం డ్రాఫ్ట్పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.
అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ.. బీసీల మానప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ‘‘కోర్టుల్లోనూ వీగిపోకుండా న్యాయనిపుణులతో చర్చించాం. దేశంలోనే తొలిసారిగా ఏపీలో చట్టం అమలు చేయబోతున్నాం. భేటీ వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. బీసీలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్నదే మా లక్ష్యం’’ అని మంత్రి సవిత తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్