
అమరావతి, 15 మార్చి (హి.స.) చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన సంచార జీవులు ఓ వినూత్న పద్ధతిలో కష్టపడుతున్నారు. పెనుగంచిప్రోలులో స్థానిక మున్నేరు వద్ద చిత్తూరు జిల్లా వాసులు సొంతగా ఉపాధి సృష్టించుకున్నారు. ఎలా అంటే.. అక్కడ మట్టి, ఇసుకను తవ్వి జల్లెడ పట్టి అందులో నుంచి సూక్ష్మకంగా ఉన్న బంగారు రేణువులను సేకరించటం.
బతుకుదెరువులో భాగంగా ప్రతి ఏడాది కొందరు సంచార జీవులు పెనుగంచిప్రోలుకు వస్తుంటారు.. అలా వచ్చిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన కొన్ని కుటుంబాల వారు మున్నేరులో బంగారం వేట సాగిస్తున్నారు. వీరంతా తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని మున్నేరులో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. వీరు ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఏటిలో పలుచోట్ల తవ్వకాలు చేస్తూ బంగారాన్ని సేకరిస్తున్నారు.
గతంలో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఏటిలో పడేసేవారు. అలా పడేసిన చెత్త ఏటి ఇసుక పొరలో కలిసిపోయేది. అలా కలిసిన ప్రదేశంలో వీరు చేస్తున్న తవ్వకాలతో చిన్నపాటి బంగారు వస్తువులు సూక్ష్మ రేణువులుగా, ముక్కలుగా లభ్యమవుతున్నాయి. మొదట మట్టి, ఇసుకను సేకరించి దానిని నీటిలో కలిసి జల్లెడ పట్టగా చిన్నపాటి బంగారు రేణువులు లభ్యమవుతున్నాయి. ఇలా సేకరించిన బంగారాన్ని చిత్తూరు ప్రాంతానికి తీసుకుపోయి విక్రయించుకుంటున్నారు.
మొత్తం కష్టపడగా కొంతమేర బంగారం లభిస్తోందని, దానిని చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులకు విక్రయిస్తామని తంబిరాజు, విజయ తెలిపారు. తమ జాతికి చెందిన వారందరు ఇదేవిధంగా రాష్ట్రంలోని పలుచోట్ల ఏటి పాయల్లో బంగారం కోసం వేట సాగిస్తూ జీవనం చేస్తున్నట్లు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ