ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా.. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై కవిత ధ్వజం
సీఎం రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Kavitha


హైదరాబాద్, 15 మార్చి (హి.స.)సీఎం రేవంత్రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు మూసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.ఫేజ్- వన్కి సంబంధించిన డీపీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని ప్రస్తావించారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని ఆరోపించారు. ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో రూ.5,641 కోట్లు ఖర్చు అవుతుందని ఈ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు.

ఆరు నెలల తర్వాత దాదాపు రూ.1400 కోట్ల అంచనా ఎందుకు పెరిగిందని కవిత నిలదీశారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఎంత ఖర్చు అవుతుందో.. ఆ ఖర్చు మొత్తం సీఎం రేవంత్రెడ్డి ఇంటి నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని అన్నారు. కానీ మూసీలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులను ప్రజెంటేషన్కు ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో చిన్న మోదీలా.. రేవంత్రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపెట్టారని సెటైర్లు గుప్పించారు. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగు నీరు వస్తోందని చెప్పుకొచ్చారు. నగరంలో ఉన్న వ్యర్థాలన్నీ మూసీలోకి వెళ్తున్నాయని తెలిపారు.

హైడ్రాతో కలిసి సీఎం రేవంత్రెడ్డి అరాచకం చేస్తున్నారని కవిత ఆగ్రహించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటివరకు ఆరు ఫిర్యాదులు చేశామని ప్రస్తావించారు. హైడ్రా కమిషనర్, ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నాలాలు ఆక్రమించి విల్లాలు కడుతున్న సంస్థ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సిగ్గు లేకుండా రంగనాథ్ హైడ్రా వీడియోలు తీసి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు పెడుతున్నారని.. మీరేమైనా కంటెంట్ రైటర్లా ...? అని ధ్వజమెత్తారు.

తాను ఆధారాలు బయటపెడితే హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వం బాయిలో దూకాలని కవిత ఎద్దేవా చేశారు. తాను ఆధారాలు బయటపెడితే ఈ ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి తనను బదనాం చేస్తారా...?, తమాషాలు చేస్తున్నారా..? అని ఆగ్రహించారు. హైడ్రా పెట్టిన ట్వీట్స్ వెంటనే డిలీట్ చేయాలని.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో అసలైన బాధితులకు ఇళ్ల పట్టాలను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. త్వరలో వెలుగుమట్లలో పర్యటిస్తానని కవిత స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande