
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)మాజీ ముఖ్యమంత్రి జగన్రెడ్డిని రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా.. ఆదివారం డి. హీరేహాళ్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కాలవ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జల్జీవన్ మిషన్ పథకాన్ని రాయదుర్గం నియోజకవర్గానికి వర్తింపజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వెనకబడిన రాయలసీమ(Rayalaseema) ప్రాంతానికి ఈ పథకానికి 2019లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి శంకుస్థాపన చేసిందన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా సీమ ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు.
ఇంతటి ద్రోహానికి పాల్పడ్డ నయవంచకుడు జగన్రెడ్డిని భవిష్యత్తులో అధికారం దరిదాపుల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత సీమ ప్రజలపై ఉందని అన్నారు. గ్రామీణుల జీవితాలతో చెలగాటమాడిన జగన్ను రాయలసీమ నుంచి వెలివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు చైర్మన్ హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్ఫొరేషన్ డైరక్టర్ నాగల్లీ రాజు, ఎంపీడీఓ దాసనాయక్, ఆర్డబ్లూఎస్ జేఈ ధనంజయ, నాయకులు మోహన్రెడ్డి, మల్లికార్జున, గంగాధర్, శ్రీరాములు, రామకృష్ణ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్