
హైదరాబాద్, 15 మార్చి (హి.స.) రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలింది. నేడు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావం ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశాముందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నట్లు తెలిపింది. మండే ఎండలతో సతమతమవుతున్న జనాలకు కొంత మేర ఉపశమనం లభించనుంది. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని కాబట్టి బయటకు వెళ్లే వాళ్లు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..