
న్యూఢిల్లీ, 16 మార్చి (హి.స.)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై సమీక్షించిన అనంతరం, పరిపాలనలో సమూల మార్పులు చేస్తూ నిన్న రాత్రి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో కీలక అధికారులను బదిలీ చేస్తూ కొత్తవారిని నియమించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా
1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నారియాలను నియమించారు.
అదేవిధంగా రాష్ట్ర హోం, హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీమతి సంఘమిత్ర ఘోష్ నియమితులయ్యారు. ఈ మార్పులను తక్షణమే అమలు చేయాలని, కొత్తగా నియమితులైన అధికారులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను కూడా వెంటనే పంపాలని ఈసీ ఆదేశించింది.
నిబంధనలు మరింత కఠినం..
ఎన్నికల విధులకు సంబంధించి బదిలీ అయిన పాత అధికారులను, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎటువంటి కీలక పోస్టులలో నియమించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు అధికారిక లేఖను అందజేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..