
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ సరఫరా చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని, శివాలిక్ నౌకలో 48 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందని కేంద్రం వెల్లడించింది. కాగా, ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్తో బయలుదేరిన 'శివాలిక్' నౌక సురక్షితంగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న సమయంలో ఈ నౌక రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపి వేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు మెల్లమెల్లగా మూతపడుతున్నాయి. హాస్టల్స్ మెనూను పూర్తిగా మార్చేశాయి. కేవలం ఒక కర్రీతో సరిపెడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా పలు దేవాలయాలు తాత్కాళికంగా ప్రసాదం తయారీని నిలిపివేశాయి. సీఎన్జీ బంకుల్లోనూ గ్యాస్ నిల్వలు అడుగంటుతున్నాయి. దీని కారణంగా గ్యాస్తో నడిచే వందలాది ఆటోలు నిలిచిపోతున్నాయి.
డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కూడా కష్టాలు తప్పటం లేదు. బుకింగ్, డెలివరీ విషయంలో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు గంటల తరబడి క్యూలో వేచి ఉంటున్నారు. యుద్ధ పరిస్థితులకు తోడు.. పండుగ సమయం కావటంతో గ్యాస్ సిలిండర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి సిలిండర్ తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్