
ఇటానగర్, 17 మార్చి (హి.స.)
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని
ఇటానగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న ఒక భవన రక్షణ గోడ (Protection Wall) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఏడుగురు కార్మికులు పనుల్లో నిమగ్నమైన ఉన్నారు. వర్షం కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి గోడ కూలడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం వల్ల సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ, శిథిలాల నుంచి ఏడుగురిని వెలికితీశారు. దురదృష్టవశాత్తూ అప్పటికే నలుగురు మృతి చెందగా, గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం స్థానిక హీమా ఆసుపత్రికి తరలించారు. మృతులను చోకి తసర్ (23), గోడక్ రాజా (30), గోడక్ తబిన్ (35), రతన్ బర్మన్ (26)గా పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..