
అమరావతి, 18 మార్చి (హి.స.)
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ లో ఈ పథకాన్ని ప్రారంభించిన నేతలు.. అనంతరం బస్టాండ్ నుంచి ఉండవల్లి వరకూ దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చేవారికి బస్సు టికెట్ పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు.
కాగా.. దివ్యాంగ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. ప్రయాణం అనంతరం దివ్యాంగులకు సీఎం తన ఇంటిలో ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి ప్రారంభం అనంతరం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సుల్లో వారితో కలిసి ఎమ్మెల్యేలు ప్రయాణించారు. కాగా.. దివ్యాంగులకు స్త్రీశక్తి బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ స్త్రీశక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV