
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల
తీసుకువచ్చేందుకు ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తాం. ఎన్ని సార్లైనా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మాది జాతీయ పార్టీ అని ఢిల్లీ నుంచే రాజకీయం ఉంటుందన్నారు. ప్రాంతీయ పార్టీ మీరు పదేళ్లు అధికారంలో ఉండగా అధికారం కాపాడుకునేందుకు మీరు ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి కేటీఆర్ ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తారనుకుంటే అదే ఊక దంపుడు ఉపన్యాసాలు, ఎవరో రాసిన స్క్రిప్ట్ ను ఇక్కడ చదివి వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీకి వెళ్లకుండా జిద్దు రాజకీయం చేయాలా? రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం మేము ఓ మెట్టు దిగైనా ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్రం ఇస్తుందా లేదా అది వారి ఇష్టం కానీ మా ప్రయత్నం కొనసాగిస్తామన్నారు.
మంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన కేటీఆర్ ఇవాళ సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని మమ్మల్ని ప్లాప్ అయిన సినిమా అంటున్నారని విమర్శించారు. ప్లాప్ అయింది మేము కాదని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్లాప్ అయింది మీరు అని సెటైర్ వేశారు. ఇన్నిసార్లు ప్లాప్ అయిన మీరు మమ్మల్ని ప్లాప్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడితే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా కనీసం ప్లాప్ నుంచి తప్పించుకుని కాస్త మెరుగు పడే అవకాశం లేదన్నారు. కానీ వింటున్నామని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు