
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో బకాయిల వసూలు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీవో నెంబర్ 58ని విడుదల చేశారు.
దీని ప్రకారం ఈ నెల 31 తేదీలోగా బకాయిలు పూర్తిగా చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ లభిస్తుంది. ఇప్పటికే వడ్డీతో కలిపి పన్ను చెల్లించిన వారికి తదుపరి బిల్లులో ఆ మినహాయింపు మొత్తాన్ని సర్దుబాటు చేసి ఇస్తామని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్