
అమరావతి, 18 మార్చి (హి.స.) ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ, దురలవాట్లతో నష్టం చేసేవాళ్లను పార్టీ మోయాల్సిన అవసరమేంటని ఆయన మండిపడ్డారు. మంగళవారం తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన.. మహేశ్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై ఆయన సీరియస్గా స్పందించారు. ‘2024 ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో మహేశ్ యాదవ్కు సీటు ఇచ్చి చట్టసభలకు పంపాం. ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లడమే తప్పు. వచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. మంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారే తమకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా?’ అని సీఎం వ్యాఖ్యానించారు.
గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. తెదేపాలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని.. ఎవరికీ వెసులుబాటు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ