
పోలవరం, 19 మార్చి (హి.స.) గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాను వణికిస్తున్న పెద్దపులి ఇప్పుడు పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాలెం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికలతో స్థానిక మన్యం ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్తిపాడు మండలం బురదకోట సమీపంలోని బాపన్నధార అడవి నుంచి పులి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. బవురువాక, తాడువాయి అభయారణ్యాల మీదుగా ఎత్తైన కొండలు, లోయల గుండా పోలవరం జిల్లా వైపు పులి అడుగులు వేస్తోంది. అయితే, వెళ్లిన మార్గంలోనే పులి తిరిగి వెనక్కి వచ్చినట్లు అధికారులు గమనించారు. ముఖ్యంగా ‘నాగులకొండ’ పర్వత శ్రేణుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర పులి సంచరించినట్లు పాదముద్రల ద్వారా స్పష్టమవుతోంది.
రంగంలోకి బృందాలు...
పులి కదలికలను పర్యవేక్షించేందుకు భారీ బృందం రంగంలోకి దిగింది. 110 మంది సిబ్బంది, 15 మంది ఉన్నతాధికారులు నిరంతరం గాలిస్తున్నారు. అటవీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత రెండు రోజులుగా పులి పశువులపై దాడి చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి జనావాసాలకు దూరంగా, అటవీ ప్రాంతంలోనే ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఒకవేళ పులి గనుక గ్రామాల వైపు వస్తే వెంటనే బంధించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటవీ ప్రాంత పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV