
అమరావతి, 19 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల (Tidco houses) కోసం డబ్బులు చెల్లించి, ఇప్పటికీ ఫ్లాట్ కేటాయింపులు జరగని 83,865 మంది దరఖాస్తుదారులకు వారు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. దీనికోసం సుమారు రూ.174 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం నిర్వహించిన పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం ఈ మేరకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
కేవలం నిధుల వాపసుతోనే ఆగకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేస్తుంది. త్వరలోనే ఈ లక్షకు పైగా గృహాలకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. చెల్లించిన సొమ్ము వృధా పోదు.. సొంతింటి కల నెరవేరుతుంది అనే భరోసాను ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా కల్పించింది. మున్సిపల్ శాఖలో మరిన్ని సంస్కరణలు తెస్తూ, పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV