
అమరావతి, 20 మార్చి (హి.స.)ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా ప్రకటించిన సాధారణ సెలవు దినాన్ని సవరించింది. వక్ఫ్ బోర్డు సీఈఓ సమర్పించిన లేఖ, చంద్రుడి దర్శనం ఆధారంగా గతంలో ప్రకటించిన సెలవు తేదీని శనివారానికి మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పు కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్లో విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పండుగను శనివారం జరుపుకోనున్న నేపథ్యంలో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సాధారణ సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు సెలవు దినాన్ని సవరించినట్లు వెల్లడించింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. శనివారం పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం శనివారాన్ని రంజాన్ సెలవుగా ప్రకటించడంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2న నిర్వహిస్తారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. ఈ వాయిదా కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగిలిన పరీక్షలన్నీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత చివరగా ఏప్రిల్ 2వ తేదీన వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని, మార్పు చేసిన తేదీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. హాల్ టికెట్లలో మార్పులు ఉండవని, అవే హాల్ టికెట్లతో ఏప్రిల్ 2న పరీక్షకు హాజరు కావచ్చని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV