
ఢిల్లీ, 20 మార్చి (హి.స.)పశ్చిమ ఆసియా (Western Asia)లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రత్యక్ష విజ్ఞప్తి మేరకు, ఇరాన్లోని అత్యంత కీలకమైన ‘అసలుయే’ (Asaluyeh) నాచురల్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయకూడదని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇశ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇవాళ అధికారిక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని, చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ట్రంప్ ఈ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఇంధన వనరులపై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతీశామని నెతన్యాహు స్పష్టం చేశారు.
గత 20 రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్ (America-Israel) సంయుక్తంగా నిర్వహించిన దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్ యొక్క యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, క్షిపణులను తయారు చేసే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఆయన వెల్లడించారు. వందలాది క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, అణ్వాయుధ అనుబంధ తయారీ కేంద్రాలను ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే నేలమట్టం చేసింది. ఇరాన్ పాలక వర్గంలో చీలికలు వస్తున్నాయని, ఆ దేశపు సైనిక శక్తి వేగంగా క్షీణిస్తోందని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను అదుపులోకి తెచ్చేందుకు కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి తెరిపించేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. ఇంధన భద్రత కోసం భవిష్యత్తులో అరేబియా ద్వీపకల్పం మీదుగా ఇజ్రాయెల్ రేవుల వరకు పైపులైన్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV