
న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.)
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత
అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న విషయం తెలిసిందే. దేశంలోని కీలక రాష్ట్రాలు అయిన పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరిలో జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) తన కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ వేదికగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (CS), డీజీపీలు (DGP), రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు (CEO), హోంశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక కీలకమైన అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశాన్ని నిర్వహించింది. ఎన్నికల సమయంలో సరిహద్దుల గుండా జరిగే అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచడం, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ఉక్కుపాదం మోపడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా ఎన్నికల సంఘం తెలిపారు.
ఈ సమావేశంలో భాగంగా మల్టీ-డిపార్ట్మెంటల్ కమిటీ ఆన్ ఎలక్షన్ ఇంటెలిజెన్స్ (MDCEI) తో కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చర్చించింది. మద్యం, నగదు, మాదకద్రవ్యాల రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు చెకపోస్టుల వద్ద నిఘాను కట్టుదిట్టం చేయాలని, నిరంతరం సమాచార మార్పిడి జరుపుకోవాలని అధికారులను ఆదేశించింది. ఎటువంటి హింసకు తావులేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా (Inducement-free) ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఈసీఐ స్పష్టం చేసింది. సరిహద్దు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతోనే ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా కమిషన్ గుర్తుచేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు