
హైదరాబాద్, 24 మార్చి (హి.స.)హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ మోసం వెలుగుచూసింది. నిజాంపేట పరిధిలో ఫ్లాట్ల విక్రయం పేరిట జరిగిన ఈ కోట్లాది రూపాయల కుంభకోణంపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటలోని విలువైన భూమిలో నిర్మించిన ఫ్లాట్లను ఒకరి కంటే ఎక్కువ మందికి విక్రయించి (డబుల్ రిజిస్ట్రేషన్), అమాయక కొనుగోలుదారులను బురిడీ కొట్టించిన ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారుల హస్తం కూడా ఉండటం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ EOW పోలీసులు నిడమర్తి శివప్రసాద్, నవీన్కుమార్ గోయల్, నరేంద్రకుమార్ మోదీ, శశికాంత్ మోదీలపై కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్లపై కూడా కేసులు నమోదయ్యాయి.
నిందితులు పక్కా పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడ్డారు. నిజాంపేటలోని 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫ్లాట్లను గతంలోనే కొందరు వ్యక్తులకు విక్రయించారు. ఆ ఫ్లాట్లు అప్పటికే అమ్ముడైన విషయాన్ని గోప్యంగా ఉంచి, మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, సూర్యకమల్ ప్రసాద్లను సంప్రదించారు. బాధితుల నుంచి రూ.15.26 కోట్లు వసూలు చేసి, అదే ఫ్లాట్లను వీరికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు.
అప్పటికే విక్రయించిన ఆస్తులను మళ్లీ తమకు అమ్మినట్లు గుర్తించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును సీరియస్గా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పాత రికార్డులను, నిందితుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్