
ఢిల్లీ, 24మార్చి (హి.స.) పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో అన్ని దేశాలకు చెందిన నౌకలు నిలిచిపోయాయి. అయితే నౌకలు విడిచిపెట్టేందుకు.. హార్ముజ్ గుండా వెళ్లేందుకు 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది చెప్పినట్లుగా ప్రభుత్వ రంగ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ వెల్లడించింది.
అయితే ఈ వార్తలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భయాందోళనలు కలిగించాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంపై ఆందోళనలు రేకెత్తాయి. తాజాగా ఈ అంశంపై ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. హార్ముజ్ గుండా వెళ్లడానికి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నిరాధారమైనవని ఇరాన్ రాయబార కార్యాలయం కొట్టిపారేసింది. హార్ముజ్ వసూలుపై ప్రకటనలు కేవలం అది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. ఆ ప్రకటన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధికారిక ప్రకటన కాదని.. ఆ ప్రకటనలు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు