
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్.. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పవర్ లూమ్ పరిశ్రమపై పడుతున్న విద్యుత్ భారాలను తొలగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న సుమారు రూ.38 కోట్ల విద్యుత్ భారంతో పాటు, పేరుకుపోయిన బ్యాక్ బిల్లింగ్, సరాఛార్జ్లను తక్షణమే మాఫీ చేయాలని కేటీఆర్ కోరారు. గతంలో ఉన్న విధంగానే పరిశ్రమకు నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలని, పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం ఉందని, వారికి తక్షణమే ఆర్థిక వెసులుబాటు కల్పించి భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలను కేటీఆర్ వివరించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యుత్ బకాయిల అంశాన్ని పరిశీలించి, కార్మికులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా నేతన్నల సంక్షేమం కోసం ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు