
జగిత్యాల, 25 మార్చి (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జగిత్యాలలో నేడు అభిమానులు, అనుచరుల సమక్షంలో ఆయన చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బాధతప్త హృదయంతో పార్టీని వీడుతున్నానని ప్రకటించిన జీవన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. 40 ఏళ్ల పాటు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేశాను... కానీ నాకు సరైన గౌరవం దక్కలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని మొదటి నుంచే చెబుతున్నానని గుర్తు చేశారు.
జగిత్యాల ఎమ్మెల్యేను కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. తనతో ఉన్న కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేకపోయాను అంటూ బాధను వ్యక్తం చేశారు. ఇక జాతీయ నాయకత్వం పై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి... రాహుల్ గాంధీ 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' అంటూ ముందుకు వెళ్తుంటే, ఇక్కడ మాత్రం ఆ విలువలను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారు” అని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పై కూడా విమర్శలు గుప్పించిన ఆయన...ప్రభుత్వంతో కలిసి పని చేయడం వేరే విషయం... కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకు? అని ప్రశ్నించారు. తన అనుచరుడి హత్య జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి పరామర్శించలేదని ఆరోపించిన జీవన్ రెడ్డి ఓపికకు కూడా హద్దు ఉంటుందని 20 నెలలుగా అవమానాలు భరిస్తూ వచ్చాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఎలా పని చేయాలి? అంటూ ప్రశ్నిస్తూ పార్టీకి గుడ్బై చెప్పారు. పార్టీని వీడినప్పటికీ ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..