
అమరావతి, 26 మార్చి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి (Amaravati)లో ఇటీవల వరుసగా అగ్ని ప్రమాదాలు (Fire hazards) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వరుస అగ్ని ప్రమాదాలపై ఏపీ ప్రభుత్వం (AP Govt) సీరియస్ అయింది. ఈ ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ (Additional SP Ravikumar) నేతృత్వంలో ఈ సిట్ విచారణ కొనసాగనుంది. ఈ బృందంలో ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు సభ్యులుగా ఉంటారు. రాజధాని ప్రాంతంలో పదేపదే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం వెనుక ఏదైనా విద్రోహ చర్య లేదా కుట్ర కోణం ఉందా అనే దిశగా సిట్ సమగ్రంగా దర్యాప్తు చేయనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనలపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాయపూడి, సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో కోట్ల విలువైన పైపులు, నిర్మాణ సామాగ్రి కాలి బూడిదైన నేపథ్యంలో.. ఈ కేసులను శాస్త్రీయ కోణంలో విచారించి త్వరితగతిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించిన తో పాటు, అనుమానితులను విచారించి రాజధాని ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV