
ఢిల్లీ, 26 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం (Fatal bus accident)లో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదంపౌ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరం. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అలాగే బాధితులను ఆదుకునేందుకు ప్రధాని మోడీ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV