
కడప,, 27 మార్చి (హి.స.)
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో తనదైన ప్రత్యేక చరిత్రను సంతరించుకున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ రోజు (శుక్రవారం) ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.
శుక్రవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఆవిష్కరించనున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ‘శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం’ ఏప్రిల్ 1వ తేదీన కన్నుల పండువగా జరగనుంది. సాధారణంగా అన్ని రామాలయాల్లో శ్రీరామ నవమి రోజే సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ, ఒంటిమిట్టలో మాత్రం అందుకు భిన్నంగా.. నవమి జరిగిన నాలుగు రోజుల తర్వాత చతుర్దశి నాటి వెన్నెల రాత్రిలో స్వామివారి కల్యాణాన్ని జరిపించడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు.. ఒంటిమిట్ట రామాలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడి రామాలయంలో హనుమంతుడు కనిపించడు. ఆంజనేయ స్వామి లేని రామాలయం కూడా ఇదొక్కటే కావడం విశేషం.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో రవాణా, భద్రతా పరంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ