
ఆళ్లగడ్డ, 27 మార్చి (హి.స.)
: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాములవారి సన్నిధిలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి, సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, కర్పూరం వంటి లేఖనాలు సమర్పించి ధూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామి అమ్మవారిని విశేషాలంకరణలో పల్లకిపై కొలువుంచి తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ