
మహబూబాబాద్, 27 మార్చి (హి.స.)
తన భర్త కుంజ రాము ఆశయాలే నా
పయనం అని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లి గ్రామంలో కుంజ రాము 22వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క తన భర్త, ఉద్యమ సహచరుడు కుంజ రాముకు కుమారుడు సూర్య, కుటుంబ సభ్యులతో కలిసి స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కుంజ రాము నా భర్త మాత్రమే కాదు. నా పోరాటానికి మార్గదర్శి. ఆదివాసీ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది. అడవుల్లో గిరిజనుల బాధలు చూసి ఆయన నిశ్శబ్దంగా ఉండలేదు. వారి కోసం తన జీవితాన్నే అంకితం చేశారని భావోద్వేగానికి లోనయ్యారు.
జల్-జంగిల్-జమీన్ హక్కులు ఆదివాసీలకే చెందాలనే నమ్మకంతో 'మావ నాటే మావ రాజ్' అన్న నినాదం ఆయన గుండె చప్పుడు. అదే ఆశయంతో నేను కూడా ప్రజల మధ్య పని చేస్తున్నాను అని కుంజ రాము లాంటి నాయకులు భౌతికంగా దూరమైన, వారి ఆలోచనలు ఎప్పటికీ చావవు. ఆయన చూపిన మార్గంలో నడవడం, ఆదివాసీ హక్కులు కాపాడడం మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అనంతరం అస్నాల శ్రీనివాస్ రచించిన అడవి దివిటీలు-సీతక్క కుంజ రామన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం కుంజ రాము పోరాట గాథను భవిష్యత్తు తరాలకు చేరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కుంజ రాముకు ఘన నివాళులర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు