
హైదరాబాద్, 27 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలోని ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలిపై సంబంధిత శాఖల మంత్రులు గుర్రుగా ఉన్నారు. సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అసెంబ్లీలో ఆరు పద్దులపై డిస్కషన్కు స్పీకర్ అనుమతినిచ్చారు. ఆ పద్దులపై జరిగే చర్చకు సంబంధిత శాఖల మంత్రులు సభలో సమాధానం ఇవ్వాలి. కానీ మంత్రులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేసేందుకు కొందరు సెక్రెటరీలు నిర్ణీయత సమయంలో రాకపోవడంతో సంబంధిత శాఖల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులకు కావాల్సిన సమాచారాన్ని ఆయా శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ఇతర అధికారులు ఇస్తుంటారు. అందుకు ఆయా శాఖల ప్రశ్నలు, పద్దులు చర్చకు వచ్చే రెండు, మూడు గంటల ముందుగానే మంత్రుల వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో వివరిస్తుంటారు. కానీ బుధవారం కొన్ని శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రెటరీలు నిర్ణీత సమయానికి రాకపోగా, తమకు బదులు జూనియర్ అధికారులను పంపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని గుర్తించిన మంత్రులు.. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలపై మండిపడినట్లు సమాచారం. 'భవిష్యత్తులో సీఎస్ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ బ్యూరోక్రట్స్ నిర్ణీత సమయానికి రాకపోవడం ఏమిటి? సీనియర్ ఆఫీసర్లకు సమయపాలన తెలియదా? అని మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సీఎస్ కు ఫిర్యాదు చేయాలనే యోచనలో ఆయా శాఖల మంత్రులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు