
అమరావతి, 27 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
విపత్తుల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలోని జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఎన్టీఆర్ జిల్లాలో 7, విజయనగరంలో 4, ఏలూరులో 4, పార్వతీపురం మన్యంలో 3, అల్లూరి జిల్లాలో 3, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండేసి చొప్పున, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 32 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది.
శనివారం (మార్చి 28) పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని, ఏకంగా 90 మండలాల్లో వడగాలులు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV