
అమరావతి, 27 మార్చి (హి.స.)ఏపీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కృష్ణాజిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 1 గ్రాము కొకైన్, 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న అనంత్ కుమార్, మహేష్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పట్టుబడిన ఇద్దరు నిందితుల్లో అనంత్ కుమార్ అనే వ్యక్తిని పాతనేరస్తుడిగా గుర్తించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. జైలునుంచి బయటకు వచ్చాక తన కార్యకలాపాలను కొనసాగిస్తూ.. డ్రగ్స్ దందాలోకి దిగినట్లు సమాచారం. వీరి వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV