
అమరావతి, 28 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో 8 ఏపీఎస్పీ బెటాలియన్ల పరిధిలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్గ్రేడ్ చేసిన 300 ఏఆర్ఎస్ఐ పోస్టులకు బదులుగా, అంతే సంఖ్యలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కర్నూలు (2వ బెటాలియన్), కాకినాడ (3వ), విజయనగరం (5వ), మంగళగిరి (6వ) బెటాలియన్లలో ఒక్కొక్కదానికి 42 చొప్పున పోస్టులను కేటాయించారు. అలాగే, 9, 11, 14, 16వ బెటాలియన్లకు తలా 33 పోస్టులను అప్గ్రేడ్ చేశారు.
రాష్ట్ర డీజీపీ 2025 జనవరి 31న పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు 2026 మార్చి 14న రాష్ట్ర కేబినెట్, మార్చి 26న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపాయి. తాజాగా హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV