
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly) కొనసాగుతున్నాయి. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ వాకౌట్ (BRS Walkout) చేసింది. అంతకు ముందు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) శాసనసభలో మాట్లాడుతూ.. వడ్డించే వాడు మనవాడు అయితే లడ్డు ఎక్కడున్న వస్తుంది అంటారు కానీ, పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడే వారు పోలీసులు. ఈ రాష్ట్రం కోసం సమాజం కోసం ఎంతో పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ పోలీసులను ఎంతో గౌరవించారని 40,50 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసి కొత్త కమీషనరేట్లు ఏర్పాటు చేశారన్నారు. ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశారని చెప్పారు.
ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని పోలీసుల భద్రత పథకాన్ని ఒక లక్షకు మాత్రమే పరిమితం చేశారన్నారు. కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టారని ఆరోపించారు. లక్షా 30 వేల మంది పోలీసుల తరుపున మాట్లాడుతున్నాననని గత సంవత్సరం కంటే 400 కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారు. పెంచాల్సిన బడ్జెట్ ఎందుకు తగ్గింది? అని ప్రశ్నించారు. మా ప్రశ్నలకు మంత్రి నుంచి ఎలాంటి అష్యూరెన్స్ లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..